సీఎం కేసీఆర్ తీరుతో.. తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో తెలంగాణ అప్పుల పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది అతిపెద్ద కుంభకోణమని, నష్టం వస్తుందని తెలిసి ఇండియాబుల్స్ వదిలేస్తే, బినామీ వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. కేంద్రాన్ని బూచిగా చూపి మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, జీతాలు, ఫెన్సన్స్ ఇచ్చే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం మూడు రూపాయలకు దొరికే విద్యుత్ని ఆరు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాల దాడులను ఖండించారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేట్ భూములను టీఆర్ఎస్ కౌన్సిలర్లు కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రామగుండం ఎరువుల కర్మాగారంను మూసివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.