ఎఐఎ ఇండిపెండెన్స్ డే వేడుకలు
బే ఏరియాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఆధ్వర్యంలో స్వదేశ్ పేరుతో ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో జరిగిన 75వ స్వాతంత్య్రదినోత్సవ అమృత మహోత్సవ్లో ఎంతోమంది భారతీయులు పాల్గొని జెండా వందనం చేశారు. బే ఏరియాలోని 35 భారత సంఘాలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. దేశభక్తి ప్రధాన అజెండాగా కార్యక్రమాలను ఈసారి నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఎక్కువమందికి అవకాశాన్ని కల్పించలేదు. భారతీయ కళలకు అద్దం పట్టేలా కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఇతర శాస్త్రీయ నృత్యాలను చిన్నారులు, పెద్దలు చేశారు. నాన్స్టాప్ బాలీవుడ్, రీజినల్ డ్యాన్స్ల కార్యక్రమం కూడా జరిగింది. బాటా కరవొకె టీమ్ ఈ వేడుకల్లో దేశభక్తిని పెంపొందించే గీతాలను ఆలపించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాన్సల్ జనరల్ డా. టీ.వీ. నాగేంద్ర ప్రసాద్, అసెంబ్లీ మెంబర్స్ యాష్ కల్రా, అలెక్స్ లీ, ఫ్రీమాంట్ మేయర్ లిలిమే, మిల్పిటాస్ మేయర్ రిచ్ ట్రాన్, సూపర్వైజర్స్ డేవిడ్ హోబర్ట్, ఒట్టోలీ, కౌన్సిల్ సభ్యులు రాజ్ సల్వాన్, రాజ్ చహల్, శ్రీధర్ వెరేజ్, కరీనా, జయరామ్ కోమటి (కమ్యూనిటీ నాయకుడు) ఇతరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ తరువాత వచ్చిన వారిని ఉద్దేశించి అతిధులు మాట్లాడి, అందరికీ 75వ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఐఎ టీమ్ ఈ కార్యక్రమాన్ని దేశభక్తి పాటలతో, ఆటలతో ఘనంగా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు 35 కమ్యూనిటీ సంఘాలు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశాయి. ఎఐఎ టీమ్ కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంఘాలకు, అడ్వర్టయిజర్లకు, స్పాన్సర్లకు, వలంటీర్లకు ధన్యవాదాలను తెలియజేసింది.