ప్రభాస్ క్రేజ్ అసలు తగ్గలేదు
కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో ఎవరంటే వెంటనే ప్రభాస్ పేరు చెప్పేస్తారు. ఇలా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రభాస్ కు తప్ప మరే ఇతర హీరో విషయంలో జరగలేదని చెప్పాలి. మిర్చి తర్వాత బాహుబలి అనే ఒక్క సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ లో ఎదిగిపోయాడో అందరికీ తెలుసు.
దీనికి కారణం రాజమౌళి అంటుంటారు చాలామంది కానీ అందులో ప్రభాస్ కష్టం, టాలెంట్ కూడా చాలా ఉంది. కానీ తర్వాత సాహో, రాధేశ్యామ్ లాంటి తన రేంజ్ కు తగని సినిమాలు చేసి తన మార్కెట్ ను కొంచెం తగ్గించుకున్నాడు. దీంతో ప్రభాస్ పనైపోయిందని, వచ్చిన స్థాయికే మళ్లీ వెళ్లడం ఖాయమని ఎద్దేవా కూడా చేశారు యాంటీ ఫ్యాన్స్.
కానీ సరైన సినిమా ప్రభాస్కు పడాలే కానీ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మళ్లీ చూస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత నుంచి వస్తున్న ప్రభాస్ సినిమాలకు నెట్టింట క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. తన రికార్డులను తనే బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇండియాలో మరే స్టార్ హీరోకు సాధ్యపడని విధంగా ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాల ట్రైలర్లతో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకున్నాడు.
రీసెంట్గా రిలీజైన ఆదిపురుష్ ట్రైలర్ అప్పుడే 100 మిలియన్ వ్యూస్ క్లబ్ లోకి అడుగుపెట్టేసింది. టీజర్ ట్రైలర్ మెజారిటీ జనాలను మెప్పించడంతో పాటూ ఇంతకుముందు సినిమాపై ఉన్న నెగిటివిటీని చెరిపేసింది. ప్రస్తుతం ఆదిపురుష్ కు పాజిటివ్ బజ్ ఏర్పడింది. మొత్తానికి ప్రభాస్ తన సినిమా ట్రైలర్లతో వరుసగా నాలుగు వంద మిలియన్ల మార్కును అందుకోవడం రికార్డు సృష్టించాడు. దీన్ని బట్టి ప్రభాస్ క్రేజ్ తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది.