ప్రతిభకు అడ్డుకట్ట వద్దు ...ఎస్ జైశంకర్
భారత్ నుంచి వచ్చే ప్రతిభకు అడ్డుకట్ట వేయొద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాకు హితవు పలికారు. ఇరు దేశాల మధ్యపాక్షిక సంబంధాల కొనసాగింపునకు హెచ్ 1బీ వీసా అంశం ఎంతో ముఖ్యమైనదని ఆయన నొక్కిచెప్పారు. భారత ఐటీ రంగ నిపుణులలో హెచ్1బీ వీసాకు అమిత డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మైక్ ఎస్పర్లతో భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జైశకంర్ మాట్లాడుతూ భారత్ నుంచి అమెరికా వచ్చే ప్రతిభా ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా ఉండటం చాలా ముఖ్యం. అర్థరహితమైన నిబంధనలతో మా ప్రయోజనాలకు విఘాతం కలిగించవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వైట్హౌస్లో అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ రాబర్టు ఓ బ్రియాన్తో జరిగిన చర్చల అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అసలు హెచ్1 బీ వీసా అంశం చట్ట పరిధి కంటే విస్తృతమైనది. కానీ ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని చట్టపరమైన చర్యలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తూ ఉండటం వల్ల చట్ట ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది. ఈ ఆంక్షలు సరైనవా కావా, విజయవంతమయ్యాయా లేదా అనేది విభిన్న అంశం. చివరిగా చెప్పదలకుకున్నది ఒకటే. ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య ఉన్న సంబంధాల స్వభావాన్ని గమనిస్తే, అవి అన్నీ నిజానికి ప్రతిభా ప్రవాహం మీదనే ఆధారపడి ఉన్నాయి అని ఒక ప్రశ్నకు జవాబుగా జైశంర్ చెప్పారు. సమావేశ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మంత్రులు మర్యాద పూర్వకంగా కలిశారు.