2018లో చేసిన కృషికి 2019లో ఫలితాలు
కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తిరుగులేని శక్తిగా ఎదగాలన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నారు. నీరు- ప్రగతి పురోగతిపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వ వాటాను వెంటనే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కౌలురైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా, ఐదు వేల మంది కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు. ఈ సందర్భంగా 2018లో జరిగిన అభివృద్ధిని వివరించిన ముఖ్యమంత్రి, 2019లో చేయాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. 2018లో చేసిన కృషికి 2019లో ఫలితాలు వస్తాయన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 11.2 శాతం వృద్ధి సాధించామని, వివిధ రంగాల్లో 675కి పైగా అవార్డులు సాధించామని తెలిపారు. కృషి కల్యాణ్ యోజనలో విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయన్నారు.