అపి ఆధ్వర్యంలో గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్
ప్రతిష్టాత్మక 14వ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సదస్సు (గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్)ను విశాఖపట్నంలో జనవరి 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (అపి) అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ జొన్నల గడ్డ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత సంతతికి చెందిన 60 వేల మంది డాక్టర్లతో ఏర్పాటైన అపి అమెరికా, భారత్ లో వైద్యంపై పలు అంశాల్లో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. విశాఖలో నిర్వహించే గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్కు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ తెలిపారు. వైద్య రంగంలో అత్యాధునిక మార్పులు, సాంకేతిక అంశాలు, భారత్ లాంటి దేశాల్లో ఆరోగ్య సమస్యలు, పరిష్కార మార్గాలపై నిపుణులు సదస్సులో చర్చించి సిద్ధాంత పత్రాలు సమర్పిస్తారని వివరించారు.