వైసీపీ గూటి నుంచి కాంగ్రెస్ కి వలస వెళ్తున్న నేతలు.. షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా..
ఆంధ్రాలో రాబోయే ఎన్నికల కోసం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. అలాగే అన్న పార్టీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నారు. పటిష్టమైన వ్యూహంతో షర్మిల ఎన్నికల బరిలో ముందుకు వెళ్తుంది అన్న టాక్ వినిపిస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఆ షర్మిల విషయంలో ఏమీ మాట్లాడలేక తటస్థంగా ఉంటున్నారు అని అందరూ భావిస్తున్నారు. కడపలో అవినాష్ రెడ్డి పేరుపై షర్మిల చేసే రచ్చ మామూలుగా లేదు. ఇక ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి స్వయంగా భారతి రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా కాంగ్రెస్ కి జై కొట్టారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిట్టిబాబు ఘన విజయాన్ని నమోదు చేశారు. ఈసారి కూడా అతను టికెట్ ఆశించారు. అయితే సెట్టింగ్ ఎమ్మెల్యేను కాదు అని జగన్ విప్పర్తి వేణుగోపాల్ కు సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురి అయిన చిట్టి బాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. షర్మిల కాంగ్రెస్ తరఫున అతని పి. గన్నవరంలో అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే నందికొట్టురు ఎమ్మెల్యే, చింతలపూడి ఎమ్మెల్యే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.. ఇలా టికెట్టు రాక నిరాశ చెందుతున్న వైసీపీ ముఖ్య నేతలను షర్మిల తెలివిగా తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. అయితే దీనివల్ల ఆమె లాభపడతారా? లేక బోర్లా పడుతారా? అన్న విషయం ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.