అమెరికా పర్యటనకు వైఎస్ విజయలక్ష్మి!
వైఎస్ విజయలక్ష్మి అమెరికా పర్యటనకు వెళ్లారు. కూతురు షర్మిల, కుమారుడు జగన్ ఒత్తిడి భరించలేక ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి స్వదేశం చేరుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్కు ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది తల్లికి సంకటంగా మారింది. జగన్ సీఎం అయ్యేందుకు తల్లీకూతుళ్లిద్దరూ కష్టపడ్డారు.
అధికారంలోకి రాగానే జగన్ ఆ ఇద్దరినీ పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన విజయలక్ష్మి, ఆ తర్వాత అడపా దడపా మాత్రమే ఆయనతో కనిపించారు. గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకునేలా పార్టీ ప్లీనరీలోనే ఆమె చేత ప్రకటన చేయించారు. అన్నతో విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయలక్ష్మీ ఆమెతోనే ఉన్నారు. అప్పుడు హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఆమె వేదికపై కనిపించారు.
షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన జగన్పై యుద్ధం ప్రకటించగానే విజయలక్ష్మికి ఇక్కటు మొదలయ్యాయి. కడప జిల్లాలో షర్మిలకు లభిస్తున్న మద్దతు, వైఎస్ బిడ్డగా జనం ఆదరిస్తున్న తీరు, వివేకా హత్య ఉదంతం వీటన్నింటి నేపథ్యంలో జగన్ తరపున ప్రచారం చేయడం సరికాదని, ఇది కూతురికి నష్టం చేస్తుందని విజయలక్ష్మి భావించినట్లు చెబుతున్నారు. ఈ సంకటం నుంచి బయటపడలేకే ఆమె అమెరికాలో బంధువుల వద్దకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.