దత్తపీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు
భాగ్యనగరం దత్తపీఠంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు 7-4-2024 నుంచి 18-4-2024 వరకు వైభవంగా జరిగాయి.
అవధూత దత్త పీఠాధిపతి (మైసూర్) పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు హైద్రాబాద్ లోని దిండిగల్ ప్రాంతంలో 1989 సం||లో దత్తావధూత దత్తాత్రేయుడిని ప్రతిష్ఠ చేసి, దత్తపీఠాన్ని స్థాపించడం జరిగింది. ప్రతీ సంవత్సరము ఉగాది పండుగకు పూజ్య శ్రీస్వామిజీ ఇక్కడకు విచ్చేసి, భక్తులను అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఈ సం|| కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినానికి, మరియు పునర్నిర్మితమైన దేవాలయ ప్రతిష్ఠా కుంభాభిషేక మహోత్సవములు నిర్వహించుటకు పరమపూజ్య శ్రీ స్వామిజీ 7-4-2024 న హైద్రాబద్ విచ్చేశారు. స్వామీజి రాకను పురస్కరించుకుని ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీ స్వామిజీ వారికి భక్తులందరు ఆశ్రమంలో స్వాగత సభను ఏర్పాటు చేశారు.
ట్రస్టీలు, కమిటీ సభ్యులు, మాతృమండలి వారు, ముఖ్యులు అందరూ శ్రీ స్వామిజీని స్వాగతించారు. తరువాత శ్రీ స్వామిజీ 3 గ్రంథాలను ఆవిష్కరించారు. అవి పూర్తి అర్థ తాత్సార్యాలతో ప్రచురితమైన తెలుగు, ఇంగ్లీషు భాషలలోని భగవద్గీత మరియు సరస్వతీ రహస్యా పనిషత్తు అనే గ్రంథాలు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ స్వామిజీ మాట్లాడుతూ జ్ఞానం కావాలని అని అనుకున్న వాళ్ళకి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్న వారికి సరస్వతీ రహస్యోపనిషత్తు ఎంతో జ్ఞానాన్ని అందించగలదనీ, పూర్తి అర్థ, తాత్పార్యాలతో ఉన్న భగవద్గీత గ్రంథం కూడా అందరూ చదివి జ్ఞానవంతులు కావాలనీ, శ్రీ స్వామిజీ ఉపదేశించారు.
నూతన సంవత్సర పంచాంగాన్ని కూడా ఆవిష్కరించారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఆ పుణ్యదినాన భగవత్ దర్శనము, సద్గురువు దర్శనము ఎంతో శుభప్రదమైనవి. పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది నాడు ఉదయం 7 గంటల నుండి భక్తులకు మహాదర్శనాన్ని అనుగ్రహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి, ఇంకా ఇతర దత్తపీఠ ఆశ్రమాల నుండి వచ్చిన భక్తులతో ఆశ్రమమంతా ఎంతో సందడిని, ఉత్సాహ పరిమళాలను సంతరించుకున్నది. ఆ రోజు సుమారు డెభ్బై (70) వేలకు పైగా భక్తులు వచ్చి, శ్రీ స్వామి వారిని దర్శించుకుని, ఉగాది ప్రసాదాన్ని స్వీకరించి, ఆనందోత్సాహలను తమ స్వంతం చేసుకున్నారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులందరికీ అన్నపూర్ణా మందిరంలో అన్న ప్రసాద వితరణ జరిగినది. సాయంత్రం నాలుగు గంటలకు వరకు శ్రీ స్వామిజీ భక్తులను దర్శనమిచ్చారు.
గురు నిలయంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా, ఆశ్రమ ప్రాంగణంలోనే నూతనంగా పునర్నిర్మితమైన అతి విశాలమైన సభామంటపం (ఆడిటోరియమ్) లో సంగీత కార్యక్రమాలు జరిగినవి. డా. జయప్రదా రామ్మూర్తి ప్లూట్ మీద, శ్రీ అశోక్ గుజ్రేల్ గారి శిష్య బృందం వయొలిన్ మీద సంగీతాన్ని వినిపించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. జయలక్ష్మీ మాత కీర్తన మండలి వారు కూడా చక్కటి కీర్తనలను ఆలపించారు. వీరందరూ శ్రీ స్వామిజీ వారి అనుగ్రహాన్ని అందుకున్నారు. ఆ సాయంత్రం అదే వేదిక మీద పూజ్య శ్రీ స్వామిజీ శ్రీచక్రపూజను నిర్వహిస్తు ఉండగా, ఆశ్రమ వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని పఠించడం జరిగింది. ప్రతీ సంవత్సరం ఉగాదికి శ్రీ స్వామిజీ కొత్త పాటను రచించి, స్వరపరచి గానం చేస్తారు. ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామిజీ, సాగి రారా క్రోధి వీరా అనే క్రొత్త ఉగాది పాటను పాడి, భక్తులను ఆనందింపజేశారు.
దిండిగల్ ఆశ్రమంలో త్రిముఖ గణపతి, దత్తాత్రేయస్వామి, నాగేశ్వర శివలింగ, రాజరాజేశ్వరీదేవి, కార్యసిద్ధి హనుమాన్, పాతాళ హనుమాన్, సుబ్రహ్యణ్యస్వామి వారి ఆలయాలు నూతనంగా పునర్ నిర్మించబడ్డాయి. శ్రీ స్వామిజీ వారి పూజా కార్యక్రమములు, సంగీత కార్యక్రమములు మొ?నవి విశేషంగా జరిగేందుకు వీలైన వేదికలతో నిర్మితమైన సభామంటపము ( ఆడిటోరియమ్) ఎంతో విశాలంగా తీర్చిదిద్దబడినది. పునర్నిర్మాణం జరిగిన దేవాలయములలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు 15వ తేదీన పూజ్య శ్రీస్వామిజీ వారి, శ్రీ బాలస్వామిజీ వారి అమృత హస్తాల మీదుగా వైభవోపేతంగా జరగనున్నాయి. 17వ తేదీన శ్రీరామ నవమి రోజు ఆశ్రమంలో పూజ్య శ్రీ స్వామిజీ, శ్రీ బాలస్వామీజీ వార్ల దివ్య సమక్షంలో శ్రీ సీతారాముల కల్యాణము కూడా శోభాయమానముగా జరుపబడును.
జై శ్రీ రామ్
సుందరి చెన్నూరి