ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ. డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్ల పేర్లతో జాబితా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. మంగళవారం రాత్రి 8 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకుంటున్నారని, వారికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్టు సమాచారం.