సీఎం జగన్ పై జరిగింది హత్యాయత్నమా...?
సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడితో వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. తమ అధినేత పర్యటనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ప్రజాస్పందనను చూసి తట్టుకోలేక చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఈ దుర్మార్గపు ఘటనకు పూనుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. అంతే కాదు.. సీఎం జగన్ ను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. జగన్ కు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కా వ్యూహంతో జరిగిందని వారు గట్టిగా చెబుతున్నారు.
సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని.. తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు.
ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే.. ఈ దాడి కాస్తా ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన హత్యాయత్నంగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. దీనికి చంద్రబాబు, టీడీపీ నేతలే కారణమంటున్నారు. చంద్రబాబు జీవితచరిత్ర అంతా మోసాలు, వెన్నుపోట్లేనని.. ఇప్పుడు అలాంటి ఎత్తుగడలే వేస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నీచపు పనికి పాల్పడ్డారని వైసీపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇది చంద్రబాబు, టీడీపీకి రాజకీయ సమాధి కడుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈఘటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకూ వివిధ అంశాలను ప్రస్తావించిన ఇరుపార్టీలు తప్పనిసరిగా ..దాడి అంశాన్ని చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎలా జరిగింది..? ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..? దీనివల్ల ఎవరికి లాభం.. ? ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా తెరపైకి రానున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో ఇరువర్గాలు అప్పుడే పని మొదలుపెట్టేశాయి . వైసీపీ సోషల్ ఆర్మీ దాడికి కారణం టీడీపీ అని ఆరోపిస్తుంటే... కాదు, ఇది కోడికత్తి 2.0 అని టీడీపీ సోషల్ ఆర్మీ కౌంటరిస్తోంది. గతంలో కోడికత్తి ఘటన ఎలా రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుందో మనందరికీ తెలిసిందే.. ఈసారి దాని స్థానంలో రాళ్లదాడి ఘటన ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. కోడికత్తి కేసు .. వైసీపీకి, జగన్ కు రాజకీయంగా మాంచి మైలేజ్ ఇచ్చింది.ఈసారి ఈ రాళ్లదాడిని ప్రచారం చేస్తే, అది ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.