జగన్ తో తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ భేటీ
తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్, బోర్డు మాజీ సభ్యుడు, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మిస్సిస్సిపి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైకాపా)లో జేరారు. తానా ఫౌండేషన్ చైర్మన్గా ఎంతోమందికి సేవలందించిన వెంకట రమణ యార్లగడ్డ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంబూరులో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన యార్లగడ్డ వైకాపాలో చేరడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షాన్ని వెలిబుచ్చాయి. తన సేవలను 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి వినియోగిస్తానని ఈ సందర్భంగా యార్లగడ్డ జగన్కు తెలిపారు. గత నెల రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న వెంకటరమణ, వైకాపా ముఖ్య నేతలు సజ్జల, అయోధ్యరామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గౌతంరెడ్డి తదితరులను కలిసి పార్టీ గెలుపుకు అవసరమైన సాయాన్ని అందిస్తానని తెలిపారు.