వివేకా హత్య కేసు కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సునీత..
హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడుతూ తన తండ్రి హత్య కేసు విషయంలో న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి హత్య కేసు కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ కేసులో విచారణ జరగనివ్వకుండా సిబిఐ పై ఒత్తిడి ఉంది అని ఆమె ఆరోపించారు. ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించిన దృశ్యాలు చూసి ఎవరైనా వివేకా కి వచ్చింది గుండెపోటు అని అంటారా అంటూ ప్రశ్నించారు. ఇక హత్య జరగడానికి ముందు రోజు రాత్రి, ఆ మరుసటి రోజు ఉదయానికి సంబంధించిన కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్, ఐపీడీఆర్ డేటాను కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా పరిగణింపబడుతున్న ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్తో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉందని ఆమె పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో కలిసి వివేకా హత్య విషయంలో మరో నిందితుడైన సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ ఉన్న ఫోటోలను ఆమె చూపించారు. అలాగే ఉమాశంకర్ రెడ్డి నుంచి అవినాష్ కి వచ్చిన ఫోన్ కాల్స్ కి సంబంధించిన వివరాలను కూడా బయటపెట్టారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ దుమారం రేపుతుందో చూడాలి.