జగన్ పై దాడి గురించి స్పందించిన షర్మిల..
ఎన్నికల ప్రచార నేపథ్యంలో మేమంతా సిద్ధం అంటూ రాష్ట్రవ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 8:10 నిమిషాల ప్రాంతంలో విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ఒక అగంతకుడు రాయితో ఆయనపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ కణతకు పదునైన వస్తువు తగలడంతో ఎడమ కనుబొమ్మ పై భాగాన బలమైన దెబ్బ తగిలింది. ప్రధమ చికిత్స చేయించుకున్న అనంతరం యధావిధిగా ఆయన తిరిగి బస్సు యాత్రను కొనసాగించారు. ప్రస్తుతం జగన్ పై జరిగిన ఈ దాడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక అగంతకుడు ముఖ్యమంత్రి పై ఇలా బహిరంగంగా దాడి చేయడం ఆంధ్ర రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల పెట్టిన ట్వీట్ ఇప్పుడు మరింత వైరల్ అయ్యింది.”సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి జరిగి ఆయన ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నాం. ఒకవేళ అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసిన చర్య అయితే దీన్ని కచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. జగన్ గారి త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను” అని షర్మిల ట్వీట్ పెట్టారు. ఆమె జగన్ క్షేమం కోసం ఆలోచిస్తూ ఈ ట్వీట్ పెట్టారు అని కొందరు వాదిస్తుంటే మరికొందరు ప్రమాదవశాత్తు అనే పదం కావాలని వాడారని.. ఇందులో కూడా ఏదో సెటైర్ దాగి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.