చంద్రబాబు లాగా సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం జగన్ కు లేదు.. సజ్జల
నిన్న రాత్రి సీఎం మేము సైతం సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగిలే అవకాశం లేదని.. ఎయిర్ గన్ లాంటిది ఉపయోగించి ఉంటారని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రాయి విసిరిన వారు ఎంతో ప్లాన్ తో ఈ పని చేశారు అంటున్నారు సజ్జల. ఎందుకంటే ఆ రాయి కాస్త పక్కకు తగిలి ఉంటే జగన్ ప్రాణానికే ప్రమాదమట. పోనీ కాస్త కింద తగిలి ఉంటే పూర్తిగా కన్ను పోయేదట. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఈ పని చేసింది కేవలం ఆకతాయిలు కాదని.. పక్కా ప్లానింగ్ తో చేసిన హత్యాయత్నం అని సజ్జల ఆరోపిస్తున్నారు. అయితే మరో పక్క టిడిపి నేతలు ఇదంతా డ్రామా అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం గురించి కూడా మాట్లాడిన సజ్జల వారు కడుపుకు అన్నం తింటున్నారా.. ఒక మనిషికి దెబ్బ తగిలితే ఇలాంటి మాటలా మాట్లాడేది అంటూ మండిపడ్డారు.అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నించారని ఈ నేపథ్యంలో గుర్తు చేసిన సజ్జల జగన్ కి అటువంటి అవసరం లేదు అని స్పష్ఠికరించారు.