నీటి సమస్య పరిష్కారానికి స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్.. వెల్లడించిన మంత్రి పొన్నం
వేసవి నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో 155313 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, నీటి సమస్య ఏర్పడిన ప్రాంతాలవారు ఈ నెంబరుకు కాల్ చేస్తే వెంటనే వారికి ట్యాంకర్లతో నీటిని అందజేయడం జరుగుతోందని, నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.
నగరంలో నీటి సమస్యలపై వార్తా పత్రికలు, మీడియాలో వస్తున్న వరుస కథనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. అందుకే వేసవిలో నీటి సమస్య తలెత్తుతోంది. దీన్ని అధిగమించడానికి హైదరాబాద్లో 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. వాటి ద్వారా ప్రజలకు నీరు అందిస్తున్నాం. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకు 2300 ఎంఎల్డీ (మెగా లీటర్స్ పర్ డే) సరఫరా చేసేవారు. ఇప్పుడు 2450 ఎంఎల్డీ నీరు సరఫరా చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నాం. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగుర్ లో నీటి నిలువలు ఉన్నాయి. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడినా 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. నీటి ట్యాంకర్ వస్తుంది. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ నగరవాసులకు హామీ ఇచ్చారు.
అనంతరం నీటి కొరత విషయంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. నీటి కొరత సమస్యను రాజకీయం చేస్తూ విపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే నీటి కొరత విషయంపై స్పందించిన సీఎం రేవంత్ కూడా.. ప్రతిపక్షాలు కావాలనే నీటి కొరత సమస్యకు రాజకీయ రంగు పులుముతున్నాయని, కొన్నిచోట్ల లేని నీటి కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరైనా కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.