పోలీసులు కీలక ప్రకటన... ఆ నిందితుల ఆచూకి చెబితే రూ.2 లక్షల రివార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన దాడికి సంబంధించి విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి ప్రకటించారు. విజయవాడ అజిత్ సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని, దృశ్యాలను అందించాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారాన్ని అందించాలని, కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి రూ. 2 లక్షల నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.
సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. దాడికి సంబంధించి ఖచ్చితమై సమాచారం తెలియజేయాలనుకునేవారు ఎన్టీఆర్ విజయవాడ పోలీసు కమిషనరేట్ డీసీపీ కంచి శ్రీనివాసరావు-9490619342, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఆర్.శ్రీహరి బాబు-9440627089, విజయవాడ కృష్ణలంక లబ్బీపేట, నేతాజీ బ్రిడ్జి రోడ్డు, పశువుల ఆసుపత్రి పక్కన, కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయం అడ్రస్కు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా నేరుగా గాని వచ్చి తెలియజేయాలని కోరారు.