లోకేష్ రెడ్ బుక్.. ఇదేమన్నా చిత్రగుప్తుడి చిట్టానా..
గత కొద్ది కాలంగా లోకేష్ తన చేతిలో రెడ్ పుస్తకాన్ని పట్టుకొని తిరగడం మనందరం గమనిస్తున్నాం. పలు సందర్భాలలో లోకేష్ ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఇందులో వైసీపీ ఆదేశం ప్రకారం వ్యవహరిస్తున్న ఎందరో అధికారులకు సంబంధించిన వివరాలతో పాటు నకిలీ కేసులు.. టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసిన వారి పేర్లు, ఇతరతర వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2024 లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పేర్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా లోకేష్ పేర్కొన్నారు. ఈ లిస్టులో ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని లోకేష్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఈయన లోకేష్ ఈ పుస్తకాన్ని అడ్డుపెట్టుకొని అందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని.. అందుకే ప్రజలకు తమపై నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతసేపు జగన్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న కూటమి నేతలు గెలిచాక ఏం చేస్తామనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ బెదిరింపులకు వైసీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.