కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇంట్లో పోలీస్ సోదాలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. కమల్నాథ్ పర్సనల్ సెక్రటరీ ఓ అభ్యంతరకరమైన ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడంటూ బీజేపీ లోక్సభ అభ్యర్థి వివేక్ బంటీ సాహు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు చింద్వారాలోని కమల్నాథ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కమల్నాథ్ ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే మిగ్లానీ తనపై ఒక అభ్యంతరకరమైన, నకిలీ వీడియో వైరల్ చేసేందుకు ప్రయత్నించారని, అందుకోసం జర్నలిస్టులకు రూ.20 లక్షలు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత సాహూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాహు ఫిర్యాదుతో మిగ్లానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయనను విచారించేందుకు సోమవారం మిగ్లానీ ఇంటికి చేరుకుని, సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఇంటరాగేట్ చేశారు. విచారణలో భాగంగానే ఛింద్వారాలోని షికార్పూర్లో ఉన్న కమల్నాథ్ నివాసంలోనూ సోదాలు జరిపారు. కమల్నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా.. పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి సాహు.. “మా తాతల కాలం నుంచి మా సోదరుల వరకు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఇక ఈ రోజు ఓ ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి.. నా కుటుంబం పరువు తీసేందుకు ప్రయత్నించారు. నేను చేతులు ముడుచుకుని మీ ముందు వేడుకుంటున్నాను - నకుల్ నాథ్ మీ బిడ్డ, నేను కూడా చింద్వారా బిడ్డనే. నేను ఈ ఎన్నికల్లో నా పార్టీ సిద్ధాంతాలతో పోరాడుతున్నాను. మీరు కూడా పోరాడగలరు. అయితే చింద్వారా బిడ్డ పరువు ఇలా తీయకండి’ అంటూ విలేకరులతో అన్నారు.