కవిత పొలిటికల్ చాప్టర్ క్లోజ్: కేటీఆర్కు ఎంపీ అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్
కవిత అరెస్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సరిగ్గా ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇరికించి కావాలని అరెస్ట్ చేశారని, ఇదంతా బీజేపీ చేయించిన కుట్రని ఈ మధ్యనే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. మీడియాతో శనివారం మాట్లాడిన అర్వింద్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయ్యిందని, ఆమె అరెస్ట్ బీజేపీకి చాలా చిన్న విషయమన్నారు. అలాగే కవిత అరెస్టును తాము ఎన్నికల్లో ఎక్కడా ఉపయోగించుకోవడం లేదని, ఇది అందరికీ అర్థమవుతూనే ఉందంటూ స్పష్టం చేశారు.
‘‘రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీల మధ్యే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి ఆ పార్టీ ప్రజలను మోసం చేసింది. అందుకే ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి’’ అంటూ విమర్శలు గుప్పించారు. అనంతరం పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చిన అర్వింద్.. జీవన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, పసుపు బోర్డు నిజామాబాద్లోనే ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇక్కడ పసుపు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రం రూ.200 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.