విశాఖలో నేరాలకి అడ్డు లేకుండా పోతోంది.. నారా లోకేష్
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అప్పుడప్పుడు కొన్ని ఘోర సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాంటిదే విశాఖపట్నం గాజువాకలో మహిళ ను తగలబెట్టడానికి ప్రయత్నించిన సంఘటన. దీనిపై తాజాగా లోకేష్ కూడా స్పందించారు. గాజువాక కు చెందిన జలమూరి రాధా.. లోకనాథం అనే స్థానిక రాజకీయ నేతను నివాసానికి పట్టా ఇప్పించవలసిందిగా ఆశ్రయించింది. అయితే అందుకు లోకనాథం డబ్బు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో అతను కోపంతో రాధ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆమె విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు లోకనాథం, శకుంతల, శ్యామల రావు పై కేసు నమోదు చేశారు. గతంలో కుళాయి వేయిస్తానని లోకనాథం 20,000 తీసుకున్నాడని.. ఇంటికి పన్ను పుస్తకం వచ్చేలా చేస్తాను అని మరొక 30000 పుచ్చుకున్నాడని రాధా ఆరోపించింది. ఇప్పుడు తన ప్రాణానికే ప్రమాదం ఉంది అని ఆమె పోలీసుల వద్ద మొరపెట్టుకుంది. ఈ ఘటనపై స్పందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖలో అఘాయిత్యాలకు అడ్డు లేకుండా పోతుందని మండిపడ్డారు.