వలసలతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు: కేటీఆర్
కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కదం తొక్కాలని, పార్టీని కథానాయకులై ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని నందినగర్లోని సొంత నివాసంలో వరంగల్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయిన కేటీఆర్.. నియోజకవర్గాల్లోని నాయకుల ద్వారా అక్కడి పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో పాటు కడియం కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో తమ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లిలో కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, తెలంగాణ ఉద్యమంలో కీలక ఉద్యమకారుడిగా ఉండడమే కాకుండా.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా పేరున్న కొప్పుల ఈశ్వర్కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాంటి ఉద్యమ గొంతుకను బీఆర్ఎస్ ఎంపీగా పార్లమెంటుకు పంపితే తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని ప్రజలకు కేటీఆర్ సూచించారు. అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కు, అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని జోస్యం చెప్పారు. అనంతరం బీజేపీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో బీజేపీకి చెప్పుకోవడానికి కనీసం ఎజెండా కూడా లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆ పార్టీ దేశంలో, రాష్ట్రంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.