బీఆర్ఎస్ను భూస్తాపితం చేయడమే లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేయడమే తన లక్ష్యమంటూ కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ నాశనం చేసిందని రాజగోపాల్రెడ్డి నిప్పులు చెరిగారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎన్నికల ఇంచార్జ్గా రాజగోపాల్రెడ్డిని కాంగ్రెస్ నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ ఎన్నికల ఇంచార్జ్ హోదాలో శనివారం భువనగిరి నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని, అయినప్పటికీ విపక్షాలు తమపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని, పార్టీకి కంచుకోట లాంటి భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ అండగా ఉన్నామని, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలదేనని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదని, అన్ని వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీని భూ స్థాపితం చేయడమే తన లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.