అంబేద్కర్కు సమున్నత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం మనదే: కేసీఆర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యం వల్లే ప్రత్యేక తెలంగాణ సాధించుకోగలిగామని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ను గుర్తు చేసుకున్న కేసీఆర్.. అంబేద్కర్ స్ఫూర్తితో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నామని, 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లు అన్నింటినీ సహించి బంగారు తెలంగాణను సాధించుకున్నామని అన్నారు.
‘‘రేపు అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం పక్షాన, మన పక్షాన అంబేద్కర్కు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నా. దేశంలోనే ఎక్కడా లేనంత సమున్నత గౌరవం అంబేద్కర్కు ఇవ్వాలని అనుకున్నాం. అందుకే మా ప్రభుత్వ హయాంలో రెండు పనులు చేశాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి ఆయనను గౌరవించుకున్నాం. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. 75 ఏండ్లలో ఇలాంటి పని ఏ రాష్ట్రమూ, ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఇలా ఆ మహనీయుడికి నివాళులర్పించుకున్న ఘనత కేవలం మునుపటి మన ప్రభుత్వానికే దక్కుతుంది’’ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సాధించుకున్న కొత్తలో రాష్ట్రంలో అంతులేని సమస్యలుండేవని, ముఖ్యంగా రైతాంగాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవల్సి వచ్చిందని చెప్పుకొచ్చిన కేసీఆర్.. రైతుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేకంగా రైతుబంధు, 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, పంట కొనుగోలు వంటి పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఎన్నికల సమయంలో అంతులేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు నాలుగు నెలలు గడిచి ఐదో నెలలో అడుగుపెడుతున్నా ఎన్నికల వాగ్దానాల్లో ఏ మాత్రం ఆచరణ కానీ, చిత్తశుద్ధి కానీ కనపడడం లేదని మండిపడ్డారు. అందుకే రాబోయే లోక్సభ ఎన్నికల్లో అయినా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని, అప్పుడే సర్కార్ మెడలు వంచి పనులు చేయించుకోగలుగుతామని ప్రజలకు పిలుపునిచ్చారు.