గాజు గ్లాసు జనసేనకే.. హైకోర్టు తీర్పుతో ఊరట చెందుతున్న జనసైనికులు..
జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. గాజు గ్లాస్ కోసం తాము దరఖాస్తు చేసుకున్న ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించింది అంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు కోర్టు తన తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. దీంతో పార్టీ సింబల్ పై జనసేనలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ఆ గుర్తు కోసం ఒకపక్క జనసేన మరొక పక్క రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ఈసీ ఆ గుర్తును ప్రీ సింబల్ లిస్టులో పెట్టింది. దీనితో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జనసేన గుర్తుపై తీర్పును వెల్లడించింది. కోర్టు గాజు గ్లాసు జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్టుగా ఈసీకి ఉత్తర్వులు జారీ చేయనుంది. తీర్పు ప్రకారం గాజు గ్లాసు గుర్తు తమకే దక్కడంతో జనసైనికులు ఆనందానికి అవధులు లేవు. రాబోయే ఎన్నికల్లో గెలుపుకి ఇది నాంది అని వారు భావిస్తున్నారు.