కాంగ్రెస్ను కేసీఆర్ ఏం చేయలేడు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏం చేయలేడని, కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు కూడా బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ చేసిన ఆరోపణలన్నింటికీ ఆగస్టులో సమాధానం చెబుతానన్నారు. ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుస్తారని, రాష్ట్రంలో 14కు పైగా ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని జోస్యం చెప్పారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని, ఎన్నికలు ముగిసిన అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.
అలాగే రాబోయే పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్కు ఎదురు లేదని ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. తమ పార్టీ బీఆర్ఎస్, బీజేపీల్లా కాదని, తమ పార్టీలో అందరూ నాయకులేనని అన్నారు. ‘‘బీఆర్ఎస్లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారు. కానీ, కాంగ్రెస్లో అలా కాదు. మా పార్టీలో అందరూ లీడర్లే. పార్టీ కోసం పనిచేసే నాయకులే. అందుకే రాష్ట్రంలో మరో 10 ఏళ్లు మా పార్టీని ఎవరూ టచ్ చేయలేరు’’ అన్నారు.