ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్ కు చెప్పండి : పవన్ కల్యాణ్
ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో వైసీపీ ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు. రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలు, తెగించి పోరాడాలి. 1960లో బామిని మండలంలో జగన్ లాంటి దోపిదీడారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర ప్రజానీకం తిరగబడింది. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్కు చెప్పండి. గ్రామం, సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు, అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలి అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి చేస్తాం. వృద్ధాప్య పింఛను రూ.4 వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. సీపీఎస్ సమస్యకు ఏడాదిలోపు పరిష్కారం చూపుతాం. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తాం. వారి సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇస్తా. పంచాయతీలకు కేంద్రం నిధులు అందించే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. పాలకొండలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.