ఇళ్ల స్థలాల పంపిణీ అప్పుడే.. జగన్
ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క తాము చేసే మంచి గురించి గొప్పగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు వైసిపి అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరిలో చేనేత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రయత్నించినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకున్నారని ఆరోపించారు. సూర్యోదయాన్ని అరచేయి అడ్డుపెట్టి ఎలా ఆపలేరో.. పేదల జీవితాలు బాగుపడాలి అనే తన సంకల్పాన్ని కూడా ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీ నే అన్న ధీమా జగన్ వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు. ఏదన్నా అనివార్య కారణాలవల్ల తాను ఆ మాట నెరవేర్చలేకపోతే.. ఆరు నెలల వ్యవధిలో కొత్త స్థలాలు కొని పేదలకు అందిస్తానని హామీ ఇచ్చారు.