సాయి పల్లవికి భారీ పారితోషికం
సౌత్ హీరోయిన్స్ లో ఎక్స్పోజింగ్ చేయకుండా అందం, నటన రెండూ చూపించగల హీరోయిన్స్ లిస్ట్ లో ఒకప్పుడు సౌందర్య ఉంటే, ఈ తరంలో సాయి పల్లవి ఉంది. అవకాశాలొస్తున్నాయి కదా అని వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పుకోకుండా కేవలం తనకు కథ, పాత్ర నచ్చితేనే ఓకే చెప్తుంది సాయి పల్లవి. మొన్నామధ్య చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ లో ఆఫర్ వస్తే నో అనేసింది. రీమేక్స్ లో నటించననే కండిషన్ పెట్టుకున్న సాయి పల్లవి డెసిషన్ ఎంత మంచిదనేది ఆ సినిమా రిజల్ట్ చూశాక అర్థమైంది.
ఇంత టాలెంట్ ఉన్నప్పటికీ సాయి పల్లవికి ఇప్పటివరకు రెమ్యూనరేషన్ పరంగా భారీగా ఏమీ ముట్టలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ సరసన నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న రామాయణం లో సీత పాత్ర కోసం సాయి పల్లవికి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవికి ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం ఇవ్వొచ్చనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.
ఈ రెమ్యూనరేషన్ ఎటు నుంచి చూసినా చాలా ఎక్కువే. ఈ ఎపిక్ ను డైరెక్టర్ నితీష్ తివారీ మూడు భాగాలుగా తీయనున్నాడు. ఎంత టైమ్ పడుతుందనేది క్లారిటీగా చెప్పలేం. ఎంతలేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో కాల్షీట్స్ అవసరమవుతాయి. అంతకంటే ఎక్కువ టైమ్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సాయి పల్లవికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందనున్న ఈ సినిమాలో రావణుడిగా యష్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, సూర్పనఖగా రకుల్ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అప్డేట్ రాలేదు.