తెలంగాణ కాంగ్రెస్ రుణమాఫీ అస్త్రం...
అధికారంలోకి వచ్చింది మొదలు స్లో అండ్ స్టడీగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి .. నెమ్మదిగా ప్రజల్ని పార్టీకి పూర్తిగా అనుసంధానించే పని మొదలు పెట్టేశారు.ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం కాదన్న విషయాన్ని.. దేశానికిఅర్థమయ్యేలా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలుత తన ప్రభుత్వాన్ని మరింతబలోపేతం చేసుకునేదిశగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. దీంతో గులాబీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు ప్రజల్ని ఆకట్టుకునేదిశగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రతీ సభలో మిషన్ 14 అంటూ ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి.
ఎన్నికల్లో రైతుల ఓట్లు ఎంత కీలకమో కాంగ్రెస్ కు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలుసు. దీనికి తోడు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ విపక్ష బీఆర్ఎస్ ఆందోెళనలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పొలంబాట పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈదశలో అందరి నోళ్లు మూయించేలా తన వద్ద ఉన్న అతిపెద్ద అస్త్రాన్ని సంధించారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోగా రైతులకు 2 లక్షల రైతు రుణమాపీ చేస్తామని నారాయణ పేట సభ సాక్షిగా ప్రకటించారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
ఇంకేముంది హస్తం శ్రేణులకు రేవంత్ అతిపెద్ద ఆయుదాన్నిచ్చారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు.. ఉత్సాహంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. రెండు లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ.. రైతులను విశేషంగా ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో రైతుల ఓట్లు కచ్చితంగా తమకే పడతాయని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలుబలంగా నమ్ముతున్నారు. ఇది కచ్చితంగా తమ పార్టీని మరింత బలోపేతం చేస్తుందంటున్నారు. దీంతో ఈసారి తాము అనుకున్న మిషన్ 14 ఎంపీ సీట్లను సాధించి తీరతామంటున్నారు హస్తం నేతలు.
ఇప్పటికే హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి పరపతి బాగా పెరిగిందని చెప్పవచ్చు. మొన్నటివరకూ కర్నాటకకు అత్యంతప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు తెలంగాణలో పార్టీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇటీవలి కాలంలో మేనిఫెస్టో నుంచి ఇతరత్రా అన్ని కార్యక్రమాలకు రాహుల్ హాజరవుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశాలిస్తున్నారు. దీంతో పార్టీ గేట్లెత్తిన రేవంత్ రెడ్డి.. తనకున్న పరిచయాలతో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కనుక మిషన్ 14 సీట్లు గెలిస్తే.. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి.. మరో రాజశేఖర రెడ్డిగా మారతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.