సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన్ని ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అడ్డాకుల, మదనాపురం, కొత్తకోట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఎన్నికల సమయంలో ఆరు అబద్ధపు హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు జరుగుతున్న ఫ్రీ బస్సు పథకంతోనూ సమస్యలు మొదలయ్యాయని, బస్సుల సంఖ్య సరిపోకపోవడంతో మహిళలు సిగలు పట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. పథకం అమలు చేసినప్పుడు బస్సులను పెంచాలన్న ఆలోచన ఆ పార్టీకి లేకపోవడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
రావణాసురుడి లాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉండనివ్వకూడదన్న డీకే అరుణ.. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఆమె.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి త్వరలో జైలు ఊచలు లెక్కబెడతారని, తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని, అందుకు రేవంత్ అతీతుడేమీ కాదని, ఆయన అతి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.