ఈ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా : చంద్రబాబు
2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగులం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేయాలనుకున్నా అన్నారు.
జగన్ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి. ఆ జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్ పోవాలి, ప్రజలు గెలవాలన్నారు.