ఎన్నికల ముందు ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్!
సార్వత్రిక ఎన్నికల ముంగిట అజిత్పవార్కు చెందిన ఎన్సీపీ ముఖ్యనేత ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్ లభించింది. సెంట్రల్ ఏజెన్సీలైన ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, బీజేపీలో చేరిపోతే కేసులు కొట్టేస్తోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓ కీలక నేతకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ లభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2017లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది మే నెలలో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రఫుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అప్పటి ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాకు పెద్ద సంఖ్యలో విమానాలను లీజుకు ఇచ్చే నేపథ్యంలో కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారనేది ఆయనపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఓ పక్క ఎయిరిండియా కోసం విమానాల కొనుగోలు జరుగుతుండగానే కొన్నింటిని లీజుకు తీసుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. విమానాల లీజు విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్తోపాటు, ఆ శాఖకు సంబంధించిన ఇంకొంతమంది కీలక అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం సీబీఐ తన రిపోర్ట్ను దాఖలు చేసింది. ఈ కేసుతో ప్రఫుల్ పటేల్కు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘‘లీజుపై విమానాలను కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలు ఆమోదం పొందాయి. అయితే, ముందస్తు రద్దు నిబంధనలు లేకపోవడం వల్ల లీజు విమానాలకు నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెట్ (ఎన్ఏసీఐఎల్) అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అప్పటి విమానయాన శాఖ అధికారుల సమక్షంలోనే ఒప్పందం జరిగింది. అందువల్ల ఇందులో ప్రఫుల్ పటేల్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఆధారాలు లేవు’’ అంటూ సీబీఐ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రఫుల్ పటేల్ బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ రావడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై మూకుమ్మడి దాడి మొదలుపెట్టేశాయి కూడా.