తెలంగాణలో రిజర్వేషన్ వార్...
తెలంగాణలో అధిక ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వివాదాస్పద కామెంట్లతో రాజకీయాన్ని రసకందాయంలో పడేశారు కమలం నేతలు. దేశంలో రిజర్వేషన్లను టచ్ చేయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా... తెలంగాణలో మాత్రం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. అంతే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు ..ఒక్కసారిగా కలకలం రేపాయి.
మరోవైపు హైదరాబాద్ ఎంపీ స్థానంపైనా బీజేపీ కన్నేసింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అసద్పై పోటీకి లోకల్ క్యాండిడేట్ అయిన మాదవీలతను బరిలోకి దింపింది. స్థానిక ఓటర్లతో పాటు ముస్లిం మహిళల ఓట్లను సాధించడంపైనా దృష్టిపెట్టింది. ఇలాంటి సమయంలో అమిత్ షా నోట రిజర్వేషన్ల రద్దుపై ప్రకటన రావడం రాజకీయంగా అగ్గిరగిల్చింది. దీన్ని ప్రధానపార్టీలైన కాంగ్రెస్, ఎంఐఎం తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. అమిత్ షా ప్రకటనతో.. బీజేపీ రాజకీయ కుట్ర బట్టబయలైందన్నారు. బీజేపీకి 400సీట్లు వస్తే ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తారని ఆరోపించారు.
ఇక మజ్లిస్కు చెప్పాలా..? నార్మల్గానే ఎంఐఎంకు కంచుకోట హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం. నాలుగు దశాబ్దాలుగా అక్కడ అసద్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. మరి అలాంటి బలమైన స్థానంలో ఉన్న అసదుద్దీన్కు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ..బలమైన ఆయుధం కానుందా..? అంటే అవుననే చెప్పాలి. ఈ ప్రకటనను .. మజ్లిస్ శ్రేణులు సైతం అంతే ధీటుగా ప్రచారాన్ని చేయనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం ద్వారా నాలుగు ఓట్లు ఎక్కువ వస్తే రావొచ్చు గాక. కాని ప్రజల మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినే అవకాశముంది. మతపరమైన వేరుభావం కలిగే పరిస్థితి ఉంటుంది. రాజకీయాలు, ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదంటున్నారు రాజకీయ నిపుణులు. చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించి, ఓట్లడగడం సరైన విధానమని.. ఇది తప్పుడు పద్దతన్న ఆరోపణలు వినవస్తున్నాయి.