జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : చంద్రబాబు
సైకో జగన్ను నమ్మి మరోసారి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. రైతుల పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ పాసు పుస్తకం ప్రతిని ఆయన చించి తగులబెట్టారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. కోడికత్తి, గులకరాయి నాటకాలాడారు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికారు.
రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారు. ఐదేళ్లలో జగన్ పరదాలు కట్టుకొని తిరిగారు. అబద్ధాలు చెప్పి ఇంకెంతకాలం మోసం చేస్తారు? మీ పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకు? అందుకే దాన్ని చించి తగులబెడుతున్నా. మీ భూములన్నీ కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఆస్తులు కొట్టేసేవాడు కావాలా? ఆస్తులు పెంచేవాడు కావాలా? జగన్ దోచేసిన డబ్బు ప్రజలకు చేరాలి. అందుకే నేను పోరాడుతున్నా. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థుడు జగన్. ఆయన మానసిక స్థితి అధ్యయనం చేస్తే నార్సి విధానమని తేలింది. ఆ స్థితి ఉంటే వాళ్లు చెప్పిందే చేయాలి. లేకపోతే దాడి చేసి చంపేస్తారు. మీ జీవితాలను మార్చే సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నా. దీనికి మోదీ గ్యారంటీ కూడా కలుపుతున్నా అని అన్నారు.