టిడిపి కూటమి గెలుపుకోసం ఎన్నారైల రాక
అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్న పలువురు ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్ష్యంతో వారు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నా, తమ విధి నిర్వహణకు కొద్ది రోజులు సెలవు పెట్టి వస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వారు స్వరాష్ట్రానికి వచ్చి ప్రచారం చేయనున్నారు. భవిష్యత్తు తరాల కోసం ఎలాంటి పరిపాలన అవసరమో వారు రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి విజన్ ఉన్న నాయకుడి ఆవశ్యకత ఎంత ఉందో ఆయా వర్గాలకు అవగాహన కల్పిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వందలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీరికి తోడయ్యారు. వెయ్యి మంది ఎన్నారైలు, మరో 500 మంది టెకీలు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరెవరు ఏయే నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగించాలో ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షులు రవికుమార్ వేమూరితో పాటు కానూరి శేషుబాబు, బుచ్చి రాంప్రసాద్, రావి రాధాకృష్ణలు ఎన్నారైలు, టెకీల ప్రచార ప్రక్రియను సమన్వయం చేస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. మరోవైపు, నేరుగా నియోజకవర్గాలకు వెళ్లలేని ఉద్యోగులు ఫోన్ ద్వారా తమ సన్నిహితుల ద్వారా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగులు పలువురు తొలి దశలో తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన ప్రముఖులతో భేటీ అవుతున్నారు.