సీఎం జగన్ పై దాడి వెనక..?
విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి.. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్రను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు.
సీఎం జగన్ పై దాడి ఎలా జ రిగింది..? అంత ఈజీగా ఎలా టార్గెట్ చేశారు. సీఎం జగన్ కు పోలీసులతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అందునా విజయవాడ లాంటి సిటీ నడిబొడ్డున దాడి జరగడమెలా సాధ్యం..? చుట్టూ పోలీస్ పహారా ఉంది. సీఎం లాంటి అత్యున్నతపదవిలో ఉన్న వ్యక్తి పర్యటన జరుగుతున్నప్పుడు పోలీసుల భద్రత హై రేంజ్ లో ఉంటుంది. ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అది కాకుండా చుట్టూ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఎక్కడి నుంచో రాయి ఎలా వచ్చింది..? అంత కచ్చితంగా జగన్ కే ఎలా తగిలింది..? ఇప్పుడిదే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాడి సమయంలో సీఎం జగన్ బస్సుపై ఉన్నారు. జై జగన్ అంటూ కార్యకర్తలు నినదిస్తున్నారు.
ఈతరుణంలో దూరం నుంచి రాయి వచ్చి పడింది. అయితే అది రాయి కాదని, వైసీపీ నేతలు చెబుతున్నారు. క్యాటిల్ బార్ తో గురి చూసి కొట్టారని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతి పెద్ద భద్రతా లోపం దాగిఉందని చెప్పక తప్పదు. సాక్షాత్తూ సీఎం స్థాయి వ్యక్తికి పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేకపోయారు. రాయి విసిరారు సరిపోయింది. ఇంకోవిధంగా దాడి జరిగితే జరగబోయే పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారు.? ప్రస్తుతమున్న డీజీపీ, ఇతర అధికారులు.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలో వారికి తెలియనిదా.. ఇప్పుడు.. ఈవ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్రం ఎలా స్పందిస్తుంది..? కేంద్ర హోంశాఖ వివరణ కోరితే ఏం వివరణ ఇవ్వనున్నారు.? సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది.
ఇంతలోనే ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశముంది. మరి దీన్ని పోలీసులు ఎలా డీల్ చేయనున్నారు..? గతంలో చాలా మంది సీఎంలు పర్యటనలు చేశారు. అయితే అప్పుడెప్పుడూ ఈస్థాయిలో దాడి జరగలేదు. ఎప్పుడో ఎన్టీఆర్ టైములో ఏదో చిన్నదాడి జరిగింది. అయితే అదికూడా నాటకీయమని.. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు చెబుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో విపక్షనేతగా పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు టూర్ లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తర్వాత పోలీసింగ్ చాలా పటిష్టమైంది.
సీఎం జగన్ విపక్షనేతగా రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. అప్పుడు ఎలాంటి దాడి జరగలేదు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి.. ఇప్పుడేమో రాళ్లదాడి జరిగింది.అంటే ఈఐదేళ్లుగా పోలీసులు విధి నిర్వహణలో విఫలమవుతూ వస్తున్నారా..? వీటన్నింటికీ పోలీసు వ్యవస్థ, రాష్ట్రప్రభుత్వం, కేంద్రహోంశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి అసలు నిజాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.