'రైతు రుణమాఫీ'పై రాజకీయ కాక..
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ సంధించిన 2 లక్షల రుణమాఫీ అస్త్రం... తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఆగస్టు 15లోగా రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు బ్యాంకర్లకు సైతం సీఎం విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో కలిపి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని..రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అయితే దీనిపై విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అది జరిగే పనికాదని.. మరోసారి కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని కేసీఆర్, హరీశ్ రావు ఆరోపించారు.
రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు హరీశ్రావు తెలిపారు.సీఎం సవాల్ను స్వీకరిస్తున్నా. ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా. సీఎం రేవంత్ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలి. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీశ్రావు సవాల్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీశ్రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్ మాదిరిగా హరీశ్రావు మాట తప్పవద్దు అని సీఎం సూచించారు. కాంగ్రెస్ మాత్రం రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీన్ని అమలుచేయడం ద్వారా రాష్ట్రప్రజలను పార్టీకి మరింత దగ్గరగా చేయొచ్చని తలుస్తోంది. ఇక మరో విషయం.. తెలంగాణలో పైలట్గా అమలు చేసిన తర్వాత దీన్ని దేశవ్యాప్తంగానూ ప్రచారాంశంగా మార్చవచ్చన్నది కాంగ్రెస్ భావనగా తెలుస్తోంది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే మేదావులు, ఇతరనిపుణులతో చర్చించిన కాంగ్రెస్ నేతలు.. ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేశారని చెబుతున్నారు.