మాతృ భాషలో విద్యాబోధన సినారె ఆకాంక్ష : ఉపరాష్ట్రపతి
మాతృ భాషలో విద్యాబోధన జరగాలని మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) ఆకాంక్ష అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో సినారె 91వ జయంతి ఉత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఒరియా రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా.ప్రతిభారాయ్ను విశ్వంభర డా.సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారంతో పాటు 5 లక్షల నగదు, శాలువాతో ఉపరాష్ట్రపతి సత్కరించారు.
అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం అంటూ కవిగా తనకు తాను పరిచయం చేసుకున్న మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి అని అన్నారు. సినారె వ్యక్తిగతంగా ఆత్మీయులు, ఆయనకు నేను అభిమానిని, ఆయన కవితాన్ని దగ్గరగా చూసి ఆనందించా, ఆస్వాదించా అని పేర్కొన్నారు. మాతృభాషలోనే బోధన ఉండాలని, రాజ్యాంగంలోని 8 షెడ్యూల్లో పేర్కొన్న భాషలకు దీనిని వర్తింపజేయాలని సినారె కోరారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పలు బిల్లులు ప్రతిపాదించారన్నారు. వాటిలోని మాతృభాష నిర్బంధ బోధన అధ్యయన బిల్లును తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రముఖ రచయిత్రి ఓల్గా, ట్రస్టు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య, సినారా మనవడు లయచరణ్ రెడ్డి, మనవరాలు మనస్వినీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.