టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సుప్రీంలో విచారణ.. కోర్టు అసహనం
మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో మధ్యర్తులుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజులుపై హైకోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ రిమాండ్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. రాజకీయాల కోసం కోర్టులను ఉపయోగించుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు సంబంధించిన బెయిల్ కేసులు ప్రస్తుతం దిగువ న్యాయస్థానంలో ఉన్నాయని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. దీంతో ఈ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Tags :