రూమర్లపై స్పందించిన సిద్దూ
గతేడాది చిన్న సినిమాగా వచ్చి విజయం సాధించిన సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఈ సినిమాతో సిద్దూ జొన్నలగడ్డకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తన క్రేజ్ను సరిగా వాడుకోవాలని డిసైడ్ అయిన సిద్దూ, వేరే సినిమాల జోలికి పోకుండా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికంటే ముందే కొన్ని వివాదాలు దాన్ని చుట్టుముట్టాయి.
డీజే టిల్లు డైరెక్టర్ విమల్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఈ చర్చనీయాంశం మొదలైంది. విమల్ ప్లేస్ లోకి మల్లిక్ రామ్ వచ్చాడు. మరోవైపు ఈ సినిమా హీరోయిన్ విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేకుండా పోయింది. రెండు మూడు సార్లు ఈ సినిమాకు హీరోయిన్ మారిందంటే టాలీవుడ్ లో ఈ సినిమా ఎంత హాట్ టాపిక్ అయుంటుందో తెలుసుకోవచ్చు.
అయితే ఇవన్నీ జరగడానికి కారణం సిద్దూ యాటిట్యూడే అని సోషల్ మీడియాలో చాలా రచ్చే జరిగింది. ఇప్పటివరకు వాటిపై స్పందించని సిద్దూ, రీసెంట్గా మాట్లాడాడు. సినిమాలో హీరోయిన్, డైరెక్టర్ గురించి ఎన్నో వార్తలొస్తున్నాయి. నాకు, విమల్ కు మధ్య గొడవైందని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి విమల్ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి కానీ అవేమీ నిజం కాదని సిద్దూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు మొదట విమల్నే సంప్రదించామని, కానీ మళ్లీ అదే ప్రాజెక్టా? కొత్తగా చేద్దాం అనేసరికి అతని మాటకు గౌరవమిచ్చి, ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్ ఏదైనా చేద్దామనుకున్నాం. అలా ఈ సీక్వెల్ సినిమాకు మల్లిక్ దర్శకుడిగా మారాడు. హీరోయిన్ విషయంలో వచ్చిన రూమర్లకు మేం చాలా నవ్వుకున్నాం. మేం మొదటి నుంచి ఈ సినిమాలో అనుకుంది అనుపమనే. తనతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నామని చెప్పుకొచ్చాడు సిద్దూ.