ప్రజలకు రాహుల్ దిక్సూచిలా కనిపిస్తున్నారు: రేవంత్ రెడ్డి
దేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో తమను రాహుల్ గాంధీ ఆదుకుంటారని ప్రజలు నమ్ముతున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక దిక్సూచిలా కనిపిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వంటి నేతలు సృష్టిస్తున్న గందరగోళం నుంచి ప్రజలను కాపాడాలనే ఆలోచనతోనే భారత్ జోడో యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారని అన్నారు. దేశ ప్రజలకు రాహుల్లో ఒక పరిణితి చెందిన నేత కనిపిస్తున్నారని తెలిపారు. దేశ విశాల ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ ఇలా పాదయాత్ర చేయడం ప్రజల అదృష్టమని రేవంత్ అన్నారు. ప్రతి రోజు పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి రాహుల్ ను కలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రాహుల్ గాంధీని ఒక పరిష్కార మార్గంగా భావిస్తున్నట్లు రేవంత్ అభిప్రాయపడ్డారు. గత నెల 23 నుంచి తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర సోమవారంతో దిగ్విజయంగా ముగుస్తుందని వెల్లడించారు. చరిత్రలో భారత్ జోడో యాత్ర.. క్విట్ ఇండియా ఉద్యమం సరసన నిలుస్తుందని జోస్యం చెప్పారు.