తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
ఈ నెల 12న తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రానున్న మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రామగుండం చేరుకుంటారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్, రామగుండం ఎరువుల కర్మాగారం సీఈవో ఏకే జైన్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్, బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎస్ సూచించారు. వేదికల వద్ద తగిన బందోబస్తు, శాంతి భద్రతలు, తదితర ఏర్పాట్లను బ్లూబుక్ ప్రకారం చేయాలని సీఎస్ ఆదేశించారు.