త్వరలో యూఏఈలో హిందూ ఆలయం ప్రారంభం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో స్వామి నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఆయన యూఏఈలో పర్యటిస్తారు. 13న అబుధాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో అహ్లాన్ మోదీ (హలో మోదీ) సభ జరగనుంది. ఆ నగర శివారులో ఒక కొండమీద 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ ఆలయాన్ని ఈ నెల 14న ఆయన ప్రారంభిస్తారు. పర్యటనపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. హిందూ ఆలయ ప్రారంభోత్సవంలో యూఏఈలోని 150 భారతీయ సంఘాలు పాలుపంచుకుంటాయి. ఈ మందిరాన్ని వీక్షించడానికి 42 దేశాల రాయబారులు, వారి సతీమణులను ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరిగింది. దాదాపు 2,000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 పాలరాతి స్తంభాల్ని కళాత్మకంగా సిద్ధం చేశారు. మోదీ సభకు రాదలిచే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ తెరిచారు. 400 మంది స్థానిక భారతీయ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేశారు.