17 ప్రాజెక్టులతో దూసుకుపోతున్న మైహోమ్ గ్రూపు
నిర్మాణ, సిమెంట్ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్, విద్యుత్ కన్సల్టెన్సీ, విద్యా, మీడియా రంగాల్లో మై హోమ్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
మైహోమ్ గ్రూపు హైదరాబాద్లో రియల్ రంగంలో ప్రస్తుతం దాదాపు 17 ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరికొన్ని ప్రాజెక్టులను చేపట్టింది. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో భూమి విలువ తక్కువగా ఉంది. అందువల్ల ఆ నగరాలతో పోలిస్తే గృహ వ్యయం ఇక్కడ తక్కువగా ఉందని మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ డెరెక్టర్ జూపల్లి రాజితారావు తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయనగరంగా అభివృద్ధి చెందుతోంది. సామాజిక మౌలిక సదుపాయాలు బాగున్నాయి. టెక్నాలజీ, ఐటీ తదితర పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నందున భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రీమియం, లగ్జరీ అపార్ట్మెంట్లకు గిరాకీ పెరిగే వీలుంది. గృహ, వాణిజ్య నిర్మాణంలోని పెద్ద కంపెనీలకు మంచి అవకాశాలు లభించే వీలుంది. ఇప్పటి వరకూ మై హోమ్ గ్రూప్ 17 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో 14 నివాస, 3 వాణిజ్య ప్రాజెక్టులు ఉన్నాయి. 2.5 కోట్ల చదరపు అడుగుల నివాస, వాణిజ్య స్థలాన్ని వినియోగదారులకు విక్రయించింది. 16000-18000 మంది ఇప్పటి వరకూ గృహాలను కొనుగోలు చేశారని రాజితా రావు అన్నారు. ప్రస్తుతం 1.3 కోట్ల చదరపు అడుగుల నివాస స్థలాన్ని మై హోమ్ అభివద్ధి చేస్తోంది. ఇందులో 5 నివాస ప్రాజెక్టులు, ఒకటి వాణిజ్య ప్రాజెక్టు ఉన్నాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్కిష్య, అంకురా, మంగళ తదితర ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. వచ్చే ఎనిమిదేళ్లలో మరో 2 నుంచి 3 కోట్ల చదరపు అడుగుల నివాస, వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు రాజితా రావు తెలిపారు. ఇందులో భాగంగా కోకాపేట్, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 10 నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టనున్నాం. ఇందుకు కంపెనీ తరపు నుంచి దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇందులో సొంత నిధులతో పాటు రుణాలు కూడా ఉంటాయని తెలిపారు.