భారత్, కెనడా మధ్య బలమైన సంబంధాలు : కెనడ మంత్రి
తెలంగాణ తమకు ప్రాధాన్య ప్రాంతమని, దీర్ఘకాలం సంబంధాలు కొనసాగుతాయని కెనడా మంత్రి అండ్రూ స్మిత్ అన్నారు. శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలోని బీటీఆర్ గ్రీన్స్లో కెనడియన్ ఉడ్తో కలిసి మ్యాక్ ప్రాజెక్ట్ చేపట్టిన వుడ్ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, కెనడా మధ్య చాలా బలమైన సంబంధాలున్నాయని అన్నారు. జీవ శాస్త్రాలు, ఫార్మా రంగాల్లో అవకాశాలపై అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సహకారంలో పలు కొత్త రంగాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. సుస్థిర గృహ నిర్మాణం అందులో ఒకటని అన్నారు. భారత్లో కలప కొరత ఉందని, తమ దేశంలో సుస్థిరమైన అడవుల నిర్వహణతో కావాల్సిన కలప అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆభరణాలు, మెకానికల్ ఉపకరణాలు, వైమానిక రంగం, వస్త్రాలు, ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, స్టీల్, ఇంధనం, ఎరువులు ఇలా ఎన్నో రంగాల్లో ఇరుదేశాల మద్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఏటా బిలియన్ డాలర్ల కెనడియన్ వజ్రాలు భారత్కు చేరుకుంటున్నాయన్నారు. భారత్, కెనడా 100 బిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలకు చేరువైనట్లు తెలిపారు. ఐదేళ్లలో వాణిజ్యం 62 శాతం పెరిగిందని తెలిపారు.
తెలంగాణలో కెనడా పెట్టుడులను పెట్టాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కాంక్రీట్ కంటే ప్రస్తుతం కలపతో నిర్మాణం వ్యయం ఎక్కువ అవుతుందని, స్టాంప్ డ్యూటీ, ఆస్తిపన్ను వంటి వాటీలో రాయితీలు ఇవ్వాలని కోరారు. విద్యుత్ వాహనాలకు రాయితీ ఇస్తున్న మాదిరి పర్యావరణ హితమైన చెక్క, ఇళ్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని మ్యాక్ ప్రాజెక్ట్ ఎండీ, రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ కాన్సలేట్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ కోరారు.