ఒకే ఒక్క కారణంతో ఐటీఐఆర్ రద్దు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీఆఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంటులో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని విమర్శించారు. బీజేపీ డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లే వేశారని విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.
ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత పెదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హామీల మాదిరె హైదరాబాద్ ఐటీఐఆర్ను కూడా మూలకు పెట్టిందని విమర్శించారు.