బీఆర్ఎస్తో నాకు ఒరిగిందేం లేదు.. మీడియా ముందే ఏడ్చేసిన కేకే
బీఆర్ఎస్ పార్టీతో తనకు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీ వల్ల తమ కుటుంబం చీలిపోయిందని కాంగ్రెస్ నేత, ఎంపీ కే కేశవరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న కేశవరావు.. ఆయన కుమార్తె విజయలక్ష్మితో కలిసి ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత కేటీఆర్.. కేకే పార్టీ మారడంపై స్పందిస్తూ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ పార్టీని వదిలి వెళ్లిపోయారని, కష్ట సమయంలో పార్టీ మారిన వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చే సమస్యే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై శనివారం స్పందించిన కేకే.. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు నాకు ఓరిగిందేమి లేదు. బీఆర్ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబ చీలిపోయింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు సీనియర్ అనే గుర్తింపు అయినా ఉండేది.. కానీ బీఆర్ఎస్లో సీనియర్ అనే పేరున్నా.. ఆ స్థాయి గుర్తింపు ఏనాడూ దక్కలేదు. పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారు. కనీసం తన కొడుకు విప్లవ్కు ఎమ్మెల్సీ అడిగినా కుదరదని చెప్పేశారు. ఇప్పుడు పార్టీ మారితే విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ను వీడిన తర్వాత తన కుమారుడు విప్లవ్ పెట్టిన మెసేజ్ మీడియాకు చూపించి భోరున ఏడ్చేశారు. ఇదిలా ఉంటే కేకేతోపాటు ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినప్పటికీ విప్లక్ మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.