దృశ్యం 3 కోసం ప్లాన్ మార్చిన జీతూ జోసెఫ్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో దృశ్యం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ని పరిచయం చేసి, తీసిన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమాగా దృశ్యం నిలిచింది. మొదట్లో జీతూ జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్ తో ఈ సినిమా రూపొందించినప్పుడు పెద్దగా అంచనాలేమీ లేవు.
మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ తర్వాత చూస్తే ఏకంగా మల్లూవుడ్ రికార్డులను మొత్తం తిరగరాసే రేంజ్ లో సినిమా హిట్ అయింది. టాలీవుడ్ లో కూడా వెంకటేష్ ఈ సినిమాను రీమేక్ చేసి, మంచి సక్సెస్ అందుకున్నారు. హిందీలో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు.
కానీ కరోనా వల్ల దృశ్యం2 కొత్త దారి వెతుక్కోవాల్సి వచ్చింది. నిర్మాతల కమిట్మెంట్లు, కరోనా నియమాల వల్ల దృశ్యం2 డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది. రెస్పాన్స్ బాగా వచ్చింది కానీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయుంటే కలెక్షన్ల పరంగా ఎంత పెద్ద హిట్ అనేది తెలిసేది. అయితే తెలుగు, మలయాళ సినిమాలే ఓటీటీలో వచ్చాయి. అజయ్ దేవగన్ తొందరపడకుండా కాస్త వెయిట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసి కాసుల వర్షం కురిపించడంతో థర్డ్ పార్ట్ కు లీడ్ వదిలేసిన డైరెక్టర్ జీతూ దాని స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేశాడట.
తాజా సమాచారం ప్రకారం, దృశ్యం3 సినిమాను ఓకేసారి మూడు భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి ఇప్పటికే మోహన్ లాల్, అజయ్ దేవగన్ ఓకే చెప్పగా, వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఒకవేళ వెంకీ కూడా ఓకే అంటే షూటింగ్ నుంచి రిలీజ్ వరకు అన్నీ ఒకేసారి జరగనున్నాయి. వెంకటేష్ ఓకే అంటే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండొచ్చు.