అవి ఓట్ల ఎన్నికలు కాదు.. నోట్ల ఎన్నికలు : జైరాం రమేశ్
మునుగోడు ఎన్నికలో ఓట్లు కాదు నోట్ల వరద పారింది. అవి ఓట్ల ఎన్నికలు కాదు, నోట్ల ఎన్నికలు అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరా రమేశ్ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడులో మద్యం, డబ్బుతోనే ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాటం చేశారని కొనియాడారు. ఉప ఎన్నిక ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్షించుకొని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. మద్యం, సంపదలే విజయం సాధించాయి. అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారు. కోట్లు సంపాదించిన వారితో ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణలో వన్సీఆర్, టూసీఆర్, త్రీసీఆర్, ఫోర్ సీఆర్ కేసీఆర్ అని గద్దర్ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తోంది. 15 రోజుల పాటు పూర్తిగా అధికార యంత్రాంగాన్ని టీఆర్ఎస్ నేతలు అక్కడ మోహరించారు. మద్యం ఏరులై పారించి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారు. మునుగోడు ఓటమితో నిరాశ చెందడం లేదు. కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది అని అన్నారు.